సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు
తెలంగాణ ప్రభ (కోరుట్ల): రాష్ట్రంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం మూసివేసిన నిజాం చెక్కర కర్మాగారాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెరిపిస్తామని ఇచ్చిన హామీకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉండడం ఎంతో సంతోషించదగ్గ విషయమని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు.
కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం మూసివేసిన నిజాం చక్కెర కర్మాగారం ముందు వందలాది మంది రైతులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
అనంతరం పత్రికా విలేకరులతో మాట్లాడుతు గతంలో రాష్ట్ర రైతాంగ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ రంగంలో చక్కెర ఫ్యాక్టరీలను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, కాలక్రమంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రైవేటు యాజమాన్యానికి వాటాలు విక్రయించి ప్రైవేట్ రంగంలో నడిపిందని, ఆ సమయంలో టిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితలు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని నిజాం చక్కెర కర్మాగారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే నడిపిస్తామని రైతులకు తద్వారా ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపించారని, కానీ పది సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించలేక పోయిందని ఆయన అన్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మూసివేసిన చక్కెర ఫ్యాక్టరీని తక్షణమే తెరిపిస్తామని హామీ ఇచ్చిందని ఆయన అన్నారు.
మాట తప్పకుండా మడమతిప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ ఫ్యాక్టరీల పునరుద్ధరణ కోసం నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారని, రైతులు నిరుద్యోగులు ఎంతో ఆనందంగా ఉన్నారని మాట తప్పని రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావుతో పాటు బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి, మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జెట్టి లింగం, కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకుడు ఏలేటి మహిపాల్ రెడ్డి, మాజీ సర్పంచులు పూదరి నర్సాగౌడ్, కడకుంట్ల సాయి, నల్ల బాపురెడ్డి, సిరిపురం సత్తయ్య, కొత్తపెళ్లి రాజేందర్, చింతామణి చిన్నారెడ్డి వెంకట్ రెడ్డి, గడ్డం లింగారెడ్డి, అంతడుపుల నరసయ్య, బుస రాజేశ్వర్ తదితరులతో పాటు వందలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
.