బాచుపల్లి ఫ్లైఓవర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

కొంపల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెచ్ఎండిఏ, జలమండలి, అటవీ, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ శాఖ   అధికారులతో సమీక్ష సమావేశం

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): కొంపల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  ఎమ్మెల్యే కేపీ.వివేకానంద  కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని బాచుపల్లి ఫ్లైఓవర్, బాచుపల్లి - బౌరంపేట్, బహదూర్ పల్లి - కొంపల్లి రోడ్డు విస్తరణ పనులపై హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, అటవీ, రెవెన్యూ, మున్సిపల్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్  అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు 3.97 కోట్ల రూపాయలతో శంకుస్థాపన జరిగి నేటికీ పూర్తి కానీ బాచుపల్లి ఫ్లై ఓవర్ పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

అదేవిధంగా బాచుపల్లి నుంచి మల్లంపేట వరకు 1.64 కోట్ల రూపాయలతో 1.20 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులను, మల్లంపేట్ నుంచి బౌరంపేట వరకు 2.07 కోట్ల రూపాయలతో సుమారు 4.80 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు, గండి మైసమ్మ నుంచి బహదూర్ పల్లి వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనుల్లో ట్రాన్స్ఫార్మర్ల షిఫ్టింగ్, కరెంటు పోల్ షిఫ్టింగ్ వంటి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. 

దీంతోపాటు మియాపూర్ నుంచి గండి మైసమ్మ వరకు కల 13.3 కిలోమీటర్ల రోడ్డు విస్తరణలో భాగంగా 1.50 కిలోమీటర్లు, కొంపల్లి - బహదూర్ పల్లి 7 కిలోమీటర్ల మార్గంలో సుమారు 5.74 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రోడ్డు వేస్తున్న పనుల్లో గల 2.8 కిలోమీటర్ల అటవీ శాఖ భూములకు అనుమతి తీసుకోని రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ రామకృష్ణారావు, దుండిగల్ కమిషనర్ సత్యనారాయణ, కొంపల్లి కమిషనర్ శ్రీహరి, ఎమ్మార్వో మతిన్, హెచ్ఎండిఏ అధికారులు యూసుఫ్ హుస్సేన్, అప్పారావు, హరికృష్ణ, వేణుగోపాలరావు, రమేష్ బాబు లతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

.