తెలంగాణ ప్రభ (కోటగిరి): జహీరాబాద్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బీబీ పాటిల్ కు భారీ మెజారిటీతో గెలిపించాలని బిజెపి నాయకులు కోరారు. కోటగిరి మండలం యాద్గార్ పూర్ గ్రామంలో బూత్ అధ్యక్షులు బోధన్ హనుమంతు ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు బిజెపి కరపత్రాలు పంపిణీ చేశారు . ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ.... భారతదేశంలో గత పదేండ్లుగా నరేంద్ర మోడీ సాహసోపేతమైన నిర్ణయాలతో దేశాన్ని అగ్రగామిగా నిలుపుతున్నారని, ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసేలా చేశారని అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో భారతదేశం ఇతర దేశాల సహాయం కోసం ఎదురుచూసేదని కానీ నేడు నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచ దేశాలకు సహాయం చేస్తే స్థాయికి భారతదేశం ఎదిగిందని అన్నారు. గత పదేళ్లుగా జహీరాబాద్ ఎంపీగా బీబీ పాటిల్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. మారుమూల నియోజకవర్గంగా పేరు ఉన్న జహీరాబాద్ కు నేషనల్ హైవేలు తీసుకొచ్చి అభివృద్ధి చేశారని చెప్పారు. జహీరాబాద్ ఎంపీగా బీబీ పాటిల్ తన సొంత ఖర్చులతో కరోనా సమయంలో ఇమ్యూనిటీ కిట్లు పంపిణీ చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ నాయకులతో సత్సంబంధాలు ఉన్న బీబీ పాటిల్ ను మరోసారి ఎంపీగా గెలిపిస్తే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రాబోయే ఎంపీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ కమలం గుర్తుకు ఓటేసి బిజెపి అభ్యర్థి బీబీ పాటిల్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి జనరల్ సెక్రెటరీ శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు వాసు, సాయిలు, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
