మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
తెలంగాణ ప్రభ (మెదక్): పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బోర్డర్ చెక్ పోస్టుల్లో వాహనాల తనిఖీలు పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. శుక్రవారం మెదక్ నియోజకవర్గం హవేలి ఘనపూర్ మండలంలోని పోచమ్మరాల్ వద్ద ఏర్పాటు చేసిన జిల్లా బార్డర్ చెక్ పోస్ట్ ను ఆర్డీవో రమాదేవి. తహసీల్దార్ తో కలసి ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా జిల్లా కలెక్టర్ రిజిస్టర్లను పరిశీలించి స్టాటిక్ సర్వే లెన్స్ బృందాలకు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు నగదు, బంగారం, ఇతరత్రా కానుకల పంపిణీ చేసే అవకాశం ఉన్నందున ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేయాలన్నారు.
తనిఖీల ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయాలన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిస్టికల్ అకౌంటింగ్, వీడియో సర్వేలెన్స్, వ్యయ పరిశీలకుల బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సరైన ఆధారాలు లేకుండా భారీ ఎత్తున నగదు, బంగారం వంటివి తరలిస్తే వెంటనే సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించాలన్నారు. సీజ్ చేసిన వస్తువులకు వివరాలు కూడిన రశీదులను అందజేయాలన్నారు.
.