ఎన్ని కుట్రలు చేసినా తన గెలుపు ఖాయం
మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): మెదక్ పార్లమెంటు ఎన్నికలో బీజేపీ గెలుపును అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాయని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒకరు బలమైన అభ్యర్థిని బరిలోకి దింపితే మరొకరు బలహీనమైన అభ్యర్ధిని బరిలోకి దింపడానికి రెండు పార్టీల నేతలు చీకటి మంతనాలు సాగిస్తున్నారని ఆరోపించారు. గురువారం మెదక్ జిల్లా హవేలీఘనపూర్ లో నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎవరెన్ని ఒప్పందాలు చేసుకున్నా మెదక్ లో మాత్రం బీజేపీ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో 17 పార్లమెంటు స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. ఇప్పటికే నిఘా వర్గాలు, వివిధ మాధ్యమాలు నిర్వహిస్తున్న సర్వేలు బీజేపీకే మొగ్గు చూపుతున్నాయని చెప్పారు. మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్ర మోడీకి మెదక్ పార్లమెంట్ సీటును నియోజకవర్గ ప్రజలు కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటువేసి తనకు అఖండ విజయాన్ని చేకూర్చాలని రఘునందన్ రావు కోరారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, ఎంఎల్ఎన్. రెడ్డి పాల్గొన్నారు.
.