గల్ఫ్ సంక్షేమంపై మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ

గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై సీఎంకు లేఖ రాసిన మంత్రి పొన్నం ప్రభాకర్ 

తగిన చర్యలు తీసుకోవాలని సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీంను ఫోన్ లో కోరిన మంత్రి 

తెలంగాణ ప్రభ (సిరిసిల్ల)కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో "గల్ఫ్ కార్మికుల సంక్షేమం, ఎన్నారైల సంక్షేమం" కోసం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టిపిసిసి ఎన్నారై విభాగం చైర్మన్ డా. బి.ఎం. వినోద్ కుమార్, టిపిసిసి ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ విభాగం కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గల్ఫ్ జెఏసీ ప్రధాన కార్యదర్శి స్వదేశ్ పరికిపండ్ల, ఏనుగు రమేష్ రెడ్డిలు కోరారు. మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. గల్ఫ్ అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీంను మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ లో కోరారు. తర్వాత సెక్రెటేరియట్ ను సందర్శించిన గల్ఫ్ సంఘాల ప్రతినిధులు సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీంను, సాధారణ పరిపాలన శాఖ (జిఎడి- ఎన్నారై) శాఖ అధికారి  ఇ. చిట్టిబాబును కలిసి గల్ఫ్ సంక్షేమం ఫైల్ ను ముందుకు తీసికెళ్లాలని కోరారు. 

గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, గల్ఫ్ కార్మికుల సంక్షేమం బోర్డు ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి ఒక ప్రత్యేక లేఖ రాశారు. ఈరోజు జరిగే మంత్రి మండలి సమావేశంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకుంటామని గల్ఫ్ జెఏసి ప్రతినిధుల బృందానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. గల్ఫ్ దేశాలలో పనిచేసే తెలంగాణ వలస కార్మికులక సామాజిక భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి అన్నట్లు తెలిపారు.

.