ఎంపీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకే సంపూర్ణ మద్దతు

పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ పూస సత్యనారాయణ

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకే సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ పూస సత్యనారాయణ తెలిపారు.  తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ పూస సత్యనారాయణ (గంగపుత్ర) ను మెదక్ పార్లమెంట్ ఇన్చార్జిగా  రాష్ట్ర అధ్యక్షులు బెల్లపు దుర్గారావు, ప్రధాన కార్యదర్శి కీర్తి యుగంధర్ లు ప్రకటించారు. ఈ సందర్భంగా పూస సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే ఫెడరేషన్లకు పాలకమండలి వేయాలని, బడ్జెట్ కేటాయించాలన్నారు. ఫెడరేషన్ లో ఉన్న కులాలు మేర, గంగపుత్ర, బొందిలి, దూదేకుల, ఆరెకటిక తదితర  కులాలకు ఫెడరేషన్, పాలకమండలి ఏర్పాటు చేయాలని, బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే  రాష్ట్ర కార్యవర్గ  ఆదేశాల మేరకు ఫెడరేషన్ కులాల డిమాండ్లకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకే మా పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు. మెదక్ పార్లమెంట్ ఇన్చార్జిగా తనను ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షులు బెల్లపు దుర్గారావు, ప్రధాన కార్యదర్శి కీర్తి యుగంధర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

.