వైద్య సిబ్బంది పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం

కౌడిపల్లి పీహెచ్ సీ, సీహెచ్ సీ  ఆకస్మిక తనిఖీ 

అందుబాటులో లేని డాక్టర్, సిబ్బంది

సమయ పాలన పాటించని వారిపై చర్యలకు ఆదేశం

రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశాలు 

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): డాక్టర్లు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని  మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. బుధవారం కౌడిపల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంను  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాలలో అన్ని వసతులు ఉన్నా సిబ్బంది అందుబాటులో లేకపోవడం సరికాదన్నారు. కౌడిపల్లి ఆరోగ్య కేంద్రం డెలివరీలలో  జిల్లాలో మంచి స్థానంలో ఉందన్నారు. స్టాఫ్ నర్సులు,  సూపర్వైజర్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కొంత మంది సిబ్బంది సెలవు పత్రము రాసి పెట్టారు కానీ అందులో తేదీని వేయలేదని ఇది సరైన పద్దతి కాదన్నారు.

పద్దతి మార్చుకోకపోతే చర్యలు తప్పవన్నారు. ఆరోగ్య కేంద్రాల పరిసరాలు, ఆరోగ్య కేంద్రంలో ఉన్న గదులను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రాల రికార్డులు, సిబ్బంది హాజరు నమోదు రికార్డ్ లను పరిశీలించారు. అందుబాటులో లేని డాక్టర్, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులతో  ఆరోగ్య కేంద్రాలలో ఉన్న సేవల గురించి ఆరా తీశారు. 

రోగులకు జరిపే పరీక్షలు, రోగులకు ఇచ్చేమందుల వివరాలను పరిశీలించారు.

సిబ్బంది పని తీరు మారాలన్నారు. సమయపాలన పాటించని డాక్టర్, సిబ్బందిని రాత పూర్వక వివరణ ఇవ్వాలని  సంబంధిత శాఖను అదేశించారు.

.