తెలంగాణ ప్రభ (సంగారెడ్డి): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కార మార్గం చూపాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలకు గురై వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 47 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిలో రెవిన్యూ సంబంధిత దరఖాస్తులు 17 , ఇతర శాఖలకు సంబంధించి 30 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవో రవీందర్రెడ్డి, కలెక్టరేట్ ఏఓ పరమేష్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
