సిద్ధార్థ్ విద్యాసంస్థలలో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో  ) మెదక్ పట్టణంలోని స్థానిక వెంకట్రావునగర్  సిద్ధార్థ్ ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని "జాతీయ గణిత దినోత్సవంను" ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గణిత విద్యావేత్త సురేష్ కుమార్, విద్యా సంస్థల చైర్మన్ శ్రీనివాస్ చౌదరితో కలిసి విద్యార్థులు ఏర్పాటు చేసిన గణిత నమూనా ప్రదర్శనశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సున్నాని  కనిపెట్టిన ఆర్యభట్ట, ప్రపంచ గణితానికి అద్భుత కానుకని అందించారని అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. సిద్దార్థ్  విద్యాసంస్థల చైర్మన్ శ్రీనివాస్ చౌదరి మాట్లాడుతూ గణితాన్ని కష్టంగా కాకుండా ఇష్టంగా నేర్చుకున్నట్లయితే  రామానుజన్ లాగా తయారు కావచ్చన్నారు.  ప్రిన్సిపల్ సంధ్యారాణి మాట్లాడుతూ  సర్వశాస్త్రాలకు గణితం తల్లి వంటిదని, రామానుజన్ గణిత శాస్త్రానికి చేసిన సేవలకు గాను రామానుజన్ జయంతిని జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారని గుర్తు చేశారు. అనంతరం ప్రదర్శనల్లో  ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.  ఈ కార్యక్రమంలో వివిధ బ్రాంచీల ప్రిన్సిపాల్స్, ఇన్చార్జీలు, గణిత ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

.