
ఈనెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ
గ్రామసభ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటికే లక్షకు పైగా దరఖాస్తులు
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ):తెలంగాణలో ఏళ్లుగా గంపెడాశలతో ఎదురుచూస్తున్న పేదల కల తీరబోతోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, తప్పులు సరిచేయడం తదితర అంశాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 28 నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహిస్తామని, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, హౌసింగ్పై గ్రామ సభలో నిర్ణయం మేరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చారు.
హైదరాబాద్లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో సోమవారం కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ( పీఏసీ ) భేటీ జరిగింది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ గురించి మంత్రులు, కాంగ్రెస్ నేతలకు మంత్రి ఉత్తమ్ కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 నుంచి దరఖాస్తులు స్వీకరించి, గ్రామ సభలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు.
గత ప్రభుత్వంలో సుమారు ఆరేళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ లేదు. ఉన్న కార్డుల్లో పేర్ల నమోదుకు కూడా అవకాశం ఇవ్వలేదు. దరఖాస్తు చేసుకున్నవారికి ఎదురుచూపులే మిగిలాయి. రేషన్ కోసమే కాకుండా, ఆరోగ్యశ్రీ తదితర సేవలకూ రేషన్ కార్డులు తప్పనిసరి అయ్యాయి. కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది పేదలు ఆయా సేవలు అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది. అర్హులైన పేద ప్రజలకు రేషన్ కార్డులు లేక, ఉన్న వాటిల్లో పేర్ల నమోదుకు అవకాశం దక్కక లక్షలాది మంది పేదలు ఆరోగ్యశ్రీ పథకాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. పుట్టింటి నుంచి అత్తగారింటికి వచ్చిన కోడలి పేరు, పుట్టిన పిల్లల పేర్లను చేర్చుకునేందుకు అవకాశం లేకుండా పోవడంతో వివిధ సేవలకు దూరం అవుతున్నారు.
ఇంతకుముందు రూపాయికి కిలో బియ్యం ఇవ్వగా.. కొవిడ్ ప్రభావంతో మూడేళ్లుగా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఆహార భద్రత కార్డులో పేరున్న సభ్యుడికి 6 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయక, పిల్లల పేర్లు చేర్చుకునేందుకు అవకాశం లేక వేలాది కుటుంబాలు ఈ ఉచిత బియ్యానికి కూడా దూరం అవుతున్నారు.
ఒక్కో జిల్లా నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే సుమారు 50 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో పాటు ఆహారభద్రత కార్డుల్లో పిల్లల పేర్ల నమోదు కోసం ఆయా జిల్లాల్లో 60 వేల నుంచి 90 వేల వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇక గ్రామాల్లోనే రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తే.. ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఒక్క మెదక్ జిల్లాలోనే ఇప్పటివరకు 2,13,873 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో ఆహార భద్రత కార్డులు 1,99,949 ఉండగా, అంత్యోదయ కార్డులు 13,857, అన్నపూర్ణ కార్డులు 67 ఉన్నాయి. కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఇప్పటికే సుమారు 30 వేలకు పైగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. సుమారు లక్షకు పైగా కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు. ప్రభుత్వం గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
.