పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలి
మంత్లీ క్రైమ్ మీటింగ్లో మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ):ప్రతి పోలీస్ అధికారి తమ విదులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, న్యాయ స్థానాలలో కేసులలో ఉన్న నిందితులకు తప్పకుండా శిక్షలు పడేందుకు కృషి చేయాలని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు.
ఆదివారం మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా సిబ్బందితో నెల వారి నేర సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో తగు చర్యలు తీసుకోవాలని, ప్రజల సేఫ్టీ సెక్యూరిటీ చాలా ముఖ్యమని తెలిపారు. గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి ఏ ఏ అంశాలు క్రోడికరించాలి తదితర అంశాల గురించి వివరించారు.
చలికాలంలో దట్టమైన పొగ మంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ఆస్కారం ఉన్నందున ప్రజలకు రోడ్డు భద్రతా నియమాల గురించి అవగాహన కలగ చేయాలని నియమాలు పాటించనివారిపై తగు చర్యలు తీసుకోవాలని, మధ్యం సేవించి వాహనాలు నడపడం కూడా ప్రమాదాలకు ముఖ్య కారణమని కావున డ్రంకెన్ డ్రైవ్ మరియు ఇతర ఈ పిట్టి కేసులు ఎప్పటికప్పుడు విధించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటారని సూచించారు.
అదే విధంగా నిబంధనలకి అనుగుణంగా లేని వాహన నంబర్ ప్లేట్లని గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రతి అధికారికి పూర్తి స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు. లాంగ్ పెండింగ్ కేసులు త్వరగా చేదించాలని, కేసుల చేదనలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించాలని, కేసు చేదించడానికి సంబంధించిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ త్వరితగతిన సేకరించుకోవాలని, కోర్టు డ్యూటీ ఆఫీసర్ విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి తరచుగా శిక్షణ తరగతులు నిర్వహించి వారి యొక్క పనితనాన్ని మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. నాన్ బేయిలబుల్ వారెంట్ త్వరగా ఎగ్జిక్యూట్ చేయాలని, అలాగే సీసీ కెమెరాలు ఉంటే గ్రామానికి రక్ష ప్రజలకు సెక్యూరిటీగా 24X7 పనిచేస్తాయని ప్రజలకు మెరుగైన సేవలు గురించి సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత దగ్గరై సేవలు చేయడానికి సీసీ కెమెరాలు ఉపకరిస్తాయని అమాయకులను చట్టం నుండి రక్షించడానికి సీసీ కెమెరాలు బాగా ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్.పి.మహేందర్, తూప్రాన్ డి.ఎస్.పి యాదగిరి రెడ్డి, ఎస్.బి సి.ఐ దిలీప్ కుమార్, డి.సి.ఆర్.బి. సి.ఐ. ప్రకాష్ గౌడ్, జిల్లా సి.ఐలు, ఎస్.ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
.