ప్రతి పేద కుటుంబానికి 10 లక్షల ఆరోగ్యశ్రీ వర్తింపు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
రెండు రోజుల్లో రెండు గ్యారెంటీలను అమలు చేసిన ప్రభుత్వం
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): ప్రభుత్వం చేసిన ఆరు వాగ్దానాలలో (గ్యారంటీలలో) రెండింటినీ రెండు రోజుల్లోనే ప్రభుత్వం అమలు చేస్తుందని, ఇది ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి. దామోదర్ రాజనర్సింహ అన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తూ అందుబాటులో తెచ్చిన మహాలక్ష్మి పథకాలను నియోజకవర్గ స్థాయిలో ఆందోల్ నియోజకవర్గంలో జోగిపేట బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఆదివారం లాంచనంగా ప్రారంభించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కు సంబంధించి బస్సులను జండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే వంద రోజుల్లో ఆరు గ్యారంటీ లు అమలు చేస్తామని చెప్పిన మేరకు ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు హామీలను అమలు చేస్తున్నామన్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాజీవ్ ఆరోగ్యశ్రీని మొదలుపెట్టామని, అదే ఆరోగ్యశ్రీ తో ప్రతి పేద కుటుంబానికి 10 లక్షల రూపాయల వరకు కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్యాన్ని అందజేస్తామన్నారు.
ఐదు లక్షల రూపాయల పరిమితినీ పది లక్షల రూపాయలకు పెంచినట్లు తెలిపారు. ఏ పేదవాడు ఆరోగ్యానికి సంబంధించి అప్పుల పాలు కావద్దని, కాంగ్రెస్ సర్కారు ప్రజల వెంట ఉందని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు.
తెలంగాణ మహిళా బిడ్డలు ఏ పుణ్యక్షేత్రమైన, మారుమూల ప్రాంతమైన, పర్యాటక ప్రాంతమైన వెళ్లేలా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని మొదలుపెట్టా
మన్నారు.ఇది కాంగ్రెస్ రెండవ వాగ్దానమని పేర్కొన్నారు. ప్రభుత్వం అన్నివేళలా ఆడబిడ్డలకు అండగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి జడ్పీ సీఈఓ ఎల్లయ్య, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గాయత్రీ దేవి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
.