సైబర్ నేరాల టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేయాలి
మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీ మహేందర్
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): మెదక్ జిల్లా ఎస్.పి పి.రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సును సైబర్ సెక్యూరిటీ బ్యూరో D.S.P సుభాష్ చంద్రబోస్, సి.ఐ N.సురేష్ కుమార్ ఆధ్వర్యంలో మెదక్ డైట్ కాలేజ్ లో “సైబర్ జాగరూకత దివాస్” సందర్భంగా సైబర్ నేరాలపై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిధి గా జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసలు సైబర్ నేరాలు అనగా ఏమిటి?, సైబర్ నేరాల రకాలు మరియు సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి తెలియజేశారు. దీనిలో భాగంగా తప్పుడు బ్యాంకు కాల్స్, డెబిట్ క్రెడిట్ కార్డ్స్ మోసాలు, లోన్ యాప్ మోసాలపై వివరంగా విద్యార్ధులకు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరగాళ్ళు ఎన్నో రకాలుగా అమాయక ప్రజల నగదును దోచుకుంటున్నారని, సైబర్ నేరాల బారిన పడే వారి సంఖ్య పెరుగుతుందని అన్నారు.
అందుకే ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతి జిల్లాలో సైబర్ నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని అన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరు తమ బంధువులు, స్నేహితులు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పిస్తూ బాధ్యతగా మెలగాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్ని అనర్ధాలు కూడా జరుగుతున్నాయని, సెల్ ఫోన్ వినియోగం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఎవరో తెలియని నేరస్థుడు సాంకేతికతను, ప్రజల అమాయకత్వాన్ని ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్ల రూపంలో దోచుకుంటున్నారని అన్నారు. సైబర్ క్రైమ్స్ పట్ల మనమంతా అవగాహన కలిగి ఉంటే వాటి బారిన పడకుండా జాగ్రత్తలు పాటించవచ్చని అన్నారు. అంతేగాక సైబర్ నేరాల గురించి 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ లేదా https://cybercrime.gov.in/ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డి.ఎస్.పి. సుభాష్ చంద్ర బోస్, సి.ఐ సురేష్, మెదక్ రూరల్ సి.ఐ రాజశేఖర్ రెడ్డి, కానిస్టేబుల్ సతీష్, డైట్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్.రమేశ్ బాబు, సెక్టోరల్ ఆఫీసర్ ఏ.సతీష్ కుమార్, ఇతర పోలీస్ సిబ్బంది, ఆద్యాపకులు, కళాశాల విద్యార్ధినీ, విద్యార్దులు పాల్గొన్నారు.
.