ప్రజలను భాగస్వామ్యం చేస్తూ స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రత్యేక అధికారి శృతి ఓఝా.

సీజనల్ వ్యాధుల నివారణకు అధికారులు సమన్వయంతో పని చేయాలి

సిరిసిల్ల .(తెలంగాణ ప్రభ): నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం స్వచ్చదనం - పచ్చదనం ప్రోగ్రాం ను ప్రజల భాగస్వామ్యంతో  విజయవంతంగా అమలు చేయాలని  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రత్యేక అధికారి శృతి ఓఝా అన్నారు.స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమ పర్యవేక్షణకు  ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు సంచాలకులు శృతి ఓఝాను రాజన్న సిరిసిల్ల , జగిత్యాల జిల్లాలకు ప్రత్యేక అధికారిగా నియమించింది.

సిరిసిల్ల జిల్లా ప్రత్యేక అధికారి బుధవారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించి స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమ అమలు తీరును తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల నేరెళ్ల గ్రామాలలో  క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సిరిసిల్ల జిల్లా ప్రత్యేక అధికారి శృతి ఓఝా  సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో  స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమ అమలు పై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ,   మండల ప్రత్యేక  అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

సిరిసిల్ల జిల్లాలో ఉన్న 255 గ్రామ పంచాయతీలు, వేములవాడ,  సిరిసిల్ల మున్సిపాలిటీలలో ఆగస్టు 5 , 6 తేదిలలో  స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమం లో భాగంగా  నిర్వహించిన కార్యక్రమాల వివరాలు , గుర్తించిన సమస్యలు వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు, ప్రత్యేక అధికారుల అనుభవాలను  మండలాల వారీగా ఆమె అడిగి తెలుసుకున్నారు. స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమ అమలు తీరు, జిల్లాలో తీసుకున్న చర్యలు,  రూపొందించుకున్న ప్రణాళికలు వంటి పలు అంశాలను జిల్లా కలెక్టర్ వివరించారు. 

ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లా ఇంఛార్జి అధికారి శృతి ఓఝా మాట్లాడుతూ స్వచ్చదనం -పచ్చదనం కార్యక్రమాన్ని  పకడ్బందీగా అమలు చేయడంలో ప్రత్యేక అధికారులు కీలకపాత్ర పోషించాలని, కిందిస్థాయి సిబ్బందికి అవసరమైన మార్గదర్శకాలు ఎప్పటికప్పుడు అందిస్తూ వారిని సరైన మార్గంలో గైడ్ చేయాలని అన్నారు. 

సమర్థవంతంగా పారిశుధ్య నిర్వహణ ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని,  గ్రీనరీ పెంచడం ద్వారా కాలుష్యం తగ్గుతుందని, పర్యావరణ సంరక్షణ సాధ్యమవుతుందని, ఈ లక్ష్యాలతో ప్రభుత్వం స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు. 

సీజనల్ వ్యాధుల నియంత్రణకు వైద్య శాఖ పంచాయతీరాజ్ శాఖ మున్సిపల్ వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. రోడ్ల గుంతలు పూడ్చే ప్రక్రియను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలని సూచించారు. మన గ్రామాలు పట్టణాలను పరిశుభ్రత, పచ్చదనం పెంపొందేలా తీర్చిదిద్దాలని, ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేస్తూ స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమాన్ని విజయ వంతంగా అమలు చేయాలని  అన్నారు.

నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం  త్రాగు నీటి సరఫరా, ఇంకుడు గుంతల నిర్మాణం,  మురికి కాల్వలను, నీటి నిల్వ ప్రాంతాలను శుభ్రం చేయడం, రోడ్ల పై ఉన్న గుంతలను పూడ్చడం,  సీజనల్ వ్యాధుల నియంత్రణ పై అవగాహన, వీధి కుక్కల దాడుల నివారణ చర్యలు, డ్రై డే, ప్రభుత్వ సంస్థలను శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలను  ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని  సూచించారు. 

ఈ సమావేశంలో వేములవాడ సిరిసిల్ల ఆర్డీవోలు రాజేశ్వర్, రమేష్ లు,  జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి , మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

.