ఎస్సి కార్పొరేషన్ ద్వారా పాడి పశువుల యూనిట్ గ్రౌండింగ్ పూర్తి చేయాలి
రెండు విడతల్లో 35 వేల 676 మంది రైతులకు 244 కోట్ల 82 లక్షల రుణమాఫీ
రుణమాఫీ పూర్తి చేసి సంబంధిత రైతుల రెన్యువల్స్ పూర్తి చేయాలి
రైతు రుణమాఫీ, పాడి పశువుల యూనిట్ గ్రౌండింగ్ అంశంపై బ్యాంకర్లతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
తెలంగాణ ప్రభ (సిరిసిల్ల): పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్ పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ బ్యాంకర్లను ఆదేశించారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రైతు రుణమాఫీ, ఈడి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పాడి పశువుల యూనిట్ల ఏర్పాటు అంశాల పై అదనపు కలెక్టర్ పి. గౌతమి తో కలిసి బ్యాంకర్లతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, ఈడి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2 వేల పాడి పశువుల యూనిట్లను 70 శాతం సబ్సిడీ, 30 శాతం బ్యాంకు లింకేజ్ రుణాలతో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించి మొదటి దశలో 619 యూనిట్ల పంపిణీ పరిపాలన అనుమతులు మంజూరు చేసిందని, ఇప్పటి వరకు 236 యూనిట్ల గ్రౌండ్ చేశామని అన్నారు.
పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్ స్థితి గతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రతి పాడి పశువుల యూనిట్ క్రింద నిరు పేద ఎస్సి కుటుంబానికి జీవనోపాధి కల్పించేందుకు 2 పాడి పశువులను లక్షా 40 వేల రూపాయల సబ్సిడీ, 60 వేల బ్యాంకు లింకేజ్ తో పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.
పెండింగ్ పాడి పశువుల యూనిట్ గ్రౌండింగ్ సంబంధించి బ్యాంకుల వారీగా కలెక్టర్ సమీక్షించారు.
మొదటి దశలో ఎంపిక చేసిన లబ్ధిదారులు పాడి పశువులు తీసుకునేందుకు ఆసక్తి చూపని పక్షంలో మిగిలిన దరఖాస్తుదారుల జాబితా నుంచి అర్హులను ఎంపిక చేసి యూనిట్ గ్రౌండ్ చేయాలని కలెక్టర్ సూచించారు.
మొదటి దశలో మంజూరు చేసిన పాడి పశువుల యూనిట్ల సబ్సిడి సోమ్ము ప్రభుత్వం విడుదల చేసిందని, ఎస్సి అధికారులు బ్యాంకర్లు సమన్వయంతో పని చేసి సంబంధిత లబ్దిదారులచే పాడి పశువుల యూనిట్ త్వరగా గ్రౌండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎస్సీ లబ్ధిదారులకు పాడి పశువులు పంపిణీ చేసిన తర్వాత కరీంనగర్ మిల్క్ డైరీ కి లింక్ చేయడం జరుగుతుందని , దీని ద్వారా రైతులకు మరో ఆధార మార్గం వచ్చి ఆర్థికంగా స్థిర పడతారని, దీనిని వెంటనే అమలు చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
2 లక్షల రుణమాఫీలో భాగంగా ప్రభుత్వం రెండు విడుతలలో లక్షన్నర వరకు రుణాలు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేస్తూ నిధులు విడుదల చేశాయని, మన సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 35 వేల 676 మంది రైతులకు 244 కోట్ల 82 లక్షల రుణమాఫీ జరిగిందని అన్నారు.
ప్రభుత్వ రైతుల రుణాలు మాఫీ చేస్తూ నిధులు విడుదల చేసినందున యాంకర్ రుణమాఫీ ఫలాలు సదరు రైతులకు చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రుణమాఫీ లబ్ధిదారులకు సంబంధించిన రుణాలు పూర్తి స్థాయిలో రెన్యూవల్ చేయాలని, ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
మన జిల్లాలో ఇప్పటి వరకు 13, 207 రుణమాఫీ లబ్దిదారులకు సంబంధించిన 84 కోట్ల 7 లక్షల రూపాయల రుణాల రెన్యూవల్ జరిగిందని , పెండింగ్ లో ఉన్న 22 ,469 మంది రైతులకు సంబంధించి 160 కోట్ల 75 లక్షల రుణాల రెన్యూవల్ ప్రక్రియ వేగవంతం చేయాలని, బ్యాంకుల్లో రుణమాఫీ రైతుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు.
రుణమాఫీ సంబంధించి రైతుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ కొరకు ప్రతి మండల కేంద్రంలో బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా గ్రీవియెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ మల్లికార్జున్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్, వివిధ బ్యాంక్ కంట్రోలర్స్, జెడ్పీ సి. ఈ ఓ. గీతా , ఎం.పి.డి. ఓ లు , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
