మళ్లీ ఇప్పుడు నేతన్నల ఆత్మహత్యలు మొదలైనయ్
కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది
కరెంట్ లేదు,ఆత్మహత్యలు మొదలైనయ్
సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే కేటీఆర్
తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); సిరిసిల్లలో పదేళ్లు ఆత్మహత్యలు అనే మాట వినబడలే కానీ.. మళ్లీ ఇప్పుడు నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయి. కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది.కరెంట్ లేదు,ఆత్మహత్యలు మొదలైనయ్యాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సోమవారం తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలోని ఎస్ ఎస్ గార్డెన్ లో బూతు స్థాయి, కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరై మాట్లాడారు.. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు, కౌలు రౌతులకు పైసలిస్తా అని రేవంత్ రెడ్డి అన్నాడు. మహిళలకు రూ. 2500, ఇంట్లో పెద్ద మనుషులు ఇద్దరికీ 4 వేలు అని, తులం బంగారం, స్కూటీలని రేవంత్ రెడ్డి గారడి మాట్లతో మాయ చేశాడే తప్ప చేసింది ఏమీ లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఐదు నెలల్లోనే ప్రజలందరికీ అన్ని విషయాలు అర్థమయ్యాయి. అన్ని వర్గాలు కోపంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన అబద్దాలనే ఇంకా చెబుతున్నారు. ఆరు గ్యారంటీల్లో ఐదు పూర్తి చేసినట్లు ఇప్పటికీ రేవంత్ రెడ్డి బొంకుతున్నాడు. మహిళలకు రూ. 2500 వచ్చినయా? ఫించన్ 4 వేలు కాదు ఒక నెల 2 వేలు ఎగగొట్టిండు, రైతు భరోసా అంటూ అబద్దాలు చెబుతున్నాడు. రుణమాఫీకి ఊసరవెళ్లి రంగులు మార్చినట్లు తేదీలు మార్చుతుండు. ఎక్కడికి వెళ్లినా సరే ఈ 4 నెలల్లో రేవంత్ రెడ్డి చేస్తుంది... దేవుడి మీద ఓట్లు... కేసీఆర్ మీద తిట్లు.. అయినా ఇక్కడ కాంగ్రెస్ తో కాదు బిజెపి తోనే మాకు పోటీ అని పేర్కొన్నారు.మోడీ 2014 లో ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కిండు. అదే ఏడాది బీఆర్ఎస్ కూడా అధికారంలోకి వచ్చింది. ఈ పదేళ్లలో ఏం పనులు చేసినవ్ అని అడిగితే కేటీఆర్ సాయంత్రం దాకా లెక్క చెబుతానన్నారు. రైతులు, నేతన్నలు, వృద్ధులకు చేసిన మంచి పనులు, అభివృద్ధి పనులు ఎన్నో చేసినం అని చెబుతానని, మరి బీజేపోళ్లకు ఎందుకు ఓటు వేయాలో ఒక్క కారణం చెప్పు అని బండి సంజయ్ ని నిలదీయండని ప్రజలను వేడుకున్నారు. ఐదేళ్లలో సిరిసిల్లకు గానీ.., తంగళపల్లికి గానీ ఒక్క పనినైనా బండి సంజయ్ చేసిండా? అంటూ మండిపడ్డారు. చిన్న, చిన్న మనస్పర్థలు పక్కన పెట్టండి. కష్టపడి పనిచేస్తే మళ్లీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తదని తెలియజేశారు. ఈనెల 10వ తారీఖు నాడు సిరిసిల్లకు కేసిఆర్ వస్తున్నాడని, ఘనంగా స్వాగతం పలుకుదామని నాయకులకు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాఫ్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమా, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ఎంపీపీ పడగల మానస రాజు, వైస్ ఎంపీపీ జంగిడి అంజయ్య, సిరిసిల్ల ప్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, నేరేల్ల ప్యాక్స్ చైర్మన్ కోడూరి భాస్కర్ గౌడ్, జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు మాట్ల మధు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మండల నాయకులు యూత్ నాయకులు , మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
.