సెక్టార్ అధికారులకు మాక్ పోల్ శిక్షణ
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడినప్పటి నుండి ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులదే కీలక బాధ్యతలు నిర్వహించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ క్రాంతి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సంగారెడ్డి, పఠాన్ చెరువు పరిధిలోని సెక్టార్ అధికారులకు పోలింగ్ నిర్వహణపై మాక్ పోల్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. LCD ప్రొజెక్టర్ ద్వారా మాక్ పోల్ డాక్యూమెంటరీని ప్రదర్శించారు. ఈ సందర్భముగా జిల్లా ఎన్నికల అధికారి క్రాంతి మాట్లాడుతూ సెక్టార్ అధికారులకు సాంకేతిక అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఎన్నికల అధికారులు గతంలో ఎన్నికల విధులు నిర్వహించినా శిక్షణ అనేది చాల ముఖ్యమైనదని తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోవాలని అధికారులకు సూచించారు. పోలింగ్ రోజు ప్రతి పోలింగ్ స్టేషన్ లలో మాక్ పోలింగ్ నిర్వహించాలని, పోలింగ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందు ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించాలని తెలిపారు. ప్రతి సెక్టార్ అధికారులకు 12 పోలింగ్ స్టేషన్ ల పరిధి ఉంటుందని, సెక్టార్ అధికారులు ప్రతి పోలింగ్ స్టేషన్లో మౌలిక సదుపాయాలు, ఓటర్ లిస్టు ముందుగా పరిశీలించాలన్నారు.
పిఓలకు ఏప్రిల్ ఒకటిన, ఏపిఓలకు 2న ఎన్నికల శిక్షణ ఉంటుందని, ఎన్నికల విధుల ఉత్తర్వులు ప్రకారం ఈ శిక్షణా కార్యక్రమానికి హాజరు కావాలని, హాజరు కానివారికి షోకాజ్ నోటీసులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఏఆర్ఓలు , తహసీల్దార్లు ఈ శిక్షణా కార్యక్రమానికి హాజరుకావాలని అన్నారు. శిక్షణా కార్యక్రమంలో ట్రైనింగ్ మెటీరియల్ అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సమావేశ మందిరంలో ఈవీఎంలు ఎర్పాటు చేసి మాక్ పోలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ , మాధురి, డీఆర్ఓ పద్మజారాణి, ఆర్డీఓలు, నోడల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
.