ప్రతిరోజు దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు రాయదుర్గం, గచ్చిబౌలి వంటి ప్రాంతాలలో పనిచేస్తున్నారు.
మెట్రో రైల్ ను విస్తరించేలా ప్రభుత్వ ప్రణాళికలు ఉండాలి కానీ విస్తరణను కుదించేలా ఉండకూడదు...
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫేజ్ -1 కింద 69 కిలోమీటర్ల మేర మూడు రూట్లలో హైదరాబాద్ మెట్రో రైలును చేపట్టి విజయవంతంగా పూర్తి చేశాం.
మెట్రో రైల్ విస్తరణలో భాగంగా ఫేస్ - 2 పనులకు గతంలోనే శంకుస్థాపన చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ - రాయదుర్గం రూటును రద్దుచేసి అక్కడి ప్రజలను అపహస్యం చేసింది. రాయదుర్గం మీదుగా కాకుండా ఓల్డ్ సిటీ మీదుగా మెట్రోను నిర్మిస్తామంటూ ప్రభుత్వం చెబుతుంది.
ఓల్డ్ సిటీలో మెట్రో నిర్మాణం చేపట్టండి మేము దానిని స్వాగతిస్తం. కానీ రాయదుర్గం మీదుగా మెట్రో అవసరం లేదనడం సరైన చర్య కాదు. ప్రతినిత్యం సుమారు పది లక్షల మంది ఉద్యోగులు ఇక్కడ విధులు నిర్వహిస్తారని, ఇది అనవసరం కాదు అవసరం.
మెట్రో రైల్ ద్వారా నగరాభివృద్ధి ఎంతగా జరిగితే అంతా చేపట్టండి. రాయదుర్గం - శంషాబాద్ రూట్ పై రాజకీయ కోణం కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి ఆ పనులను కొనసాగిస్తే దీని ద్వారా వికారాబాద్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలతో పాటు పలు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.
మెట్రో రైల్ ఫేజ్ -2 కోసం 24 వేల కోట్లు అవసరమవగా 1100 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ పనులను ఎప్పుడు పూర్తి చేస్తారని దానిపై నిర్ధిష్ట కాలపరిమితి లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే నిర్దిష్ట కాలపరిమితిని పెట్టి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.
అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఫేజ్ -3 కింద చేపడతామని అంటున్న దాదాపు 200 కిలోమీటర్ల మెట్రో రైల్ గురించి అసలు ఊసే లేదు. ఫేజ్ -3 పనులు చేపడదామనే ఆలోచన ఉందా లేదా అటకెక్కించారా అనేది స్పష్టం చేయాలి.
.