ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి::జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

తెలంగాణ ప్రభ (వేములవాడ): జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని, వైద్య సిబ్బంది చిత్త శుధ్దితో, నిబద్ధతతో అప్రమత్తంగా పనిచేయాలని  జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం వేములవాడ ఏరియా ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలను జిల్లా కలెక్టర్ , అదనపు కలెక్టర్లు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.

ముందుగా చిన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో ఆట వస్తువులు, సౌకర్యాలు పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడి నుంచి నేరుగా ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్ కు వెళ్లి అక్కడ ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో చూశారు. ఆన్లైన్ లో వివరాలు నమోదు చేసే విధానాన్ని చూసి, రోగులతో మాట్లాడారు.

గర్భిణీలకు అందుతున్న సేవలు నెల వారి టార్గెట్ లు , అచీవ్మెంట్ లు ,ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత, ప్రసవాల సంఖ్య ,  హాజరు , సెలవు వివరాలు వంటి తదితర అంశాల పై  వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక గర్భిణీ తో మాట్లాడి, ఆమె మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించి,సేవలు ఎలా అందుతున్నాయి అని వివరాలు కలెక్టర్ తెలుసుకున్నారు. గర్భిణీలకు వ్యాయామం, ఆరోగ్య అవహహన కల్పించే గదిని పరిశీలించి, మందులు పంపిణీ చేసే విధానాన్ని చూశారు.

కార్యక్రమంలో  వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్, డి.ఎం.&హెచ్. ఓ  సుమన్ మోహన్ రావు, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ మహేష్ రావు, వైద్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

.