తెలంగాణ ప్రభ (సిరిసిల్ల): నాబార్డ్ సౌజన్యంతో చేపట్టే జీవనోపాధుల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ కార్యక్రమాల ను సద్వినియోగం చేసుకునేందుకు ఆసక్తి చూపే నిరుద్యోగ యువత, స్వయం సహాయక సంఘాలను గుర్తించేందుకు జిల్లాలోని అన్ని ఆర్ అండ్ ఆర్ కాలనీలలో అవగాహన సదస్సులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి నాబార్డ్, గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులకు సూచించారు.
బుధవారం IDOCలో నాబార్డ్ సౌజన్యంతో చేపట్టే జీవనోపాధుల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ కార్యక్రమాల పై నాబార్డ్, గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారుల కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
నాబార్డ్ సౌజన్యంతో ఇచ్చే శిక్షణ కార్యక్రమం కోసం ఎన్ రోల్ చేసుకున్న అభ్యర్థులకు శిక్షణ తో పాటు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్, స్టైఫండ్, వసతి సౌకర్యం కూడా ఉంటుందన్న విషయాన్ని యువతకు, స్వయం సహాయక సంఘాలకు తెలియజేయాలన్నారు. శిక్షణ తీసుకున్న సంఘాలను, వ్యక్తులను ప్రోత్సహించేందుకు యూనిట్ ల స్థాపన కు వీలుగా లోన్ ఫెసిలిటీ కూడా
ఉంటుందన్నారు. శిక్షణ పొందిన తర్వాత ఉమ్మడిగా సంఘాలు లేదా అభ్యర్థులు రూరల్ మార్ట్ పేరుతో యూనిట్ లు పెట్టుకుంటే నాబార్డ్ రూ.5 లక్షల వరకూ ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు.
అవగాహన సదస్సుల నిర్వహణ, శిక్షణ కార్యక్రమాల ప్లానింగ్ ను మానిటరింగ్ చేయాలన్నారు.
సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు ఎన్ ఖిమ్యా నాయక్, పూజారి గౌతమి, నాబార్డ్ జిల్లా డెవలప్మెంట్ మేనేజర్ మనోహర్ రెడ్డి, DRDO నక్క శ్రీనివాస్, అదనపు DRDO మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
