ప్రజలకు మాటిచ్చి నిలబెట్టుకునే ప్రభుత్వం
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): మాది ప్రజల ప్రభుత్వమని, ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.
మంగళవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మండలం హనుమంత్ రావు పేట్ గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించే బాధ్యత ప్రభుత్వానిదని, ప్రభుత్వమే ప్రజల ముందుకు వచ్చి, ప్రజలతో మమేకమై ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు, సాధక బాదకాలు తెలుసుకుని ఇబ్బందులను తొలగించడం కోసం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు.
మీ అవసరాలకు సంబంధించిన వివరాలు దరఖాస్తులో నింపి కౌంటర్లలో అధికారులకు ఇచ్చి, రసీదు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
గతంలో ఒకప్పుడు రెవిన్యూ సదస్సులు ఇతర కార్యక్రమాల ద్వారా ప్రజల ముందుకు ప్రభుత్వం వచ్చేదని, ఆనాడు ఇందిరమ్మ పేరిట ఇండ్లు, ఇండ్ల స్థలాలు అందజేశామని గుర్తు చేశారు. ఇప్పుడూ అదే విధంగా సంక్షేమం ప్రజలకు అందిస్తామని మంత్రి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే మహాలక్ష్మి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని,
పేదవారికి ఆరోగ్య భద్రత ఇవ్వడానికి ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద అందిస్తున్న వైద్య సేవలను ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచి వైద్య సేవలను అందిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేసిందన్నారు. దరఖాస్తులను
ఈనెల 6వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుందని, అర్హులైన వారందరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగంచేసుకోవాలని కోరారు. ఒకవేళ ఈరోజు దరఖాస్తు ఇవ్వలేని వారు మిగిలిన రోజులలో ఆయా గ్రామ, వార్డు అధికారులకు అందజేయవచ్చని తెలిపారు. ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
నారాయణఖేడ్ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని, ఇది ప్రజల ప్రభుత్వమని ప్రజలకు మాటిచ్చి నిలబెట్టుకునే ప్రభుత్వమని మంత్రి పేర్కొన్నారు. అనంతరం మంత్రి మహిళల నుండి ధరఖాస్తులను స్వీకరించి రసీదు అందజేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఆరు గ్యారంటీలపై, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలతో మంత్రి మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించి ప్రజలందరిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. అర్హులందరికీ ఆయా పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాజీ ఎంపీ సురేష్ షట్కార్, డిపిఓ, డిఎఫ్ఓ, డి.ఎస్.పి,
ఆయా అధికారులు, రెవిన్యూ డివిజనల్ అధికారి , తహసిల్దార్, ఎంపీడీవో, గ్రామ సర్పంచ్, ఎంపీపీ, జడ్పిటిసి, ఎంపీటీసీ, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
.