పాలనను ప్రజలకు చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యం

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ 

తెలంగాణ ప్రభ  ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు అర్హులకు సంక్షేమ ఫలాలను అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించిందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. శుక్రవారం సదాశిపేట మండలం ఆరూర్ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి కలెక్టర్ శరత్ ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రజా పాలన కార్యక్రమం ప్రవేశపెట్టి అభయ హస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. జనవరి 6 వరకు  ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. 

గృహలక్ష్మి, రైతు భరోసా, చేయూత, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలలో ఎవరికి ఏది అవసరం ఉందో దానికి  దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను ఉచితంగా ఇస్తున్నామని, జిరాక్స్ సెంటర్లలో, బయట ఎవరైనా అమ్మినట్లయితే తీసుకోవద్దని తెలిపారు.

ఏదేని కారణం వల్ల గ్రామ సభలో దరఖాస్తు చేసుకోలేని వారు జనవరి 6వ తేదీ వరకు తమ దరఖాస్తులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందజేయవచ్చని ప్రతి దరఖాస్తుతో పాటు ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్ ప్రతులను జత చేయాలన్నారు.  దరఖాస్తులో లేని అంశాలకు సంబంధించి ఏవేని దరఖాస్తులు ఉన్నట్లయితే, ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేశామని అట్టి దరఖాస్తులను అందులో ఇవ్వాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మహిళలను

బస్సులలో  ప్రయాణం చేస్తున్నారా? డబ్బులు తీసుకుంటున్నారా? డబ్బులు లేకుండా టికెట్ ఇస్తున్నారా అని  అడుగగా, టికెట్ ఇస్తున్నారు కానీ డబ్బులు తీసుకోవడం లేదని, ఉచితంగా ప్రయాణం చేస్తున్నామని మహిళలు నవ్వుతూ  చెప్పారు. కొందరు మహిళల  నుండి దరఖాస్తులను స్వీకరించి, రసీదులను  అందజేశారు. అనంతరం ఆయా కౌంటర్లు అన్నింటిని తిరిగి, కౌంటర్లలో సిబ్బంది  పనితీరును, రిజిస్టర్లను దరఖాస్తులను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా సహకరించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి రవీందర్ రెడ్డి, సదాశివపేట ఎంపీడీఓ పూజ, తహసిల్దార్, సంబంధిత అధికారులు,  గ్రామ సర్పంచ్ మధు, లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.

.